తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీలోని ఐదు గదులు కూలిపోయాయి. వివరాల్లోకి వెళితే.. మడతుపట్టి ప్రాంతంలో ఉన్న ‘ఎక్సెల్ ఫైర్‌వర్క్స్’ అనే బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు విధుల్లో ఉండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మందుగుండు సామగ్రి పేలింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ ప్రాంగణం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 60 మంది కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తూ, లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పలువురిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Virudhunagar Fire Accident
Tamil Nadu Fire Accident
Firecracker Factory Accident
Excel Fireworks
Madathupatti
Fire Accident in India
Virudhunagar
Tamil Nadu
Firecrackers

More Telugu News